సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పీఏ బిభవ్ కుమార్‌కు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ జస్టిస్ అనూప్ కుమార్ పిటిషన్‌ను తిరస్కరించారు

Update: 2024-07-12 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పీఏ బిభవ్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. కేసు దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బిభవ్ కుమార్ పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ జస్టిస్ అనూప్ కుమార్ పిటిషన్‌ను తిరస్కరించారు. బిభవ్ కుమార్ ఓ ముఖ్యమంత్రి పీఏ కావడం వల్ల సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బిభవ్ కుమార్, మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడ్డాడు. మే 18న అతడిని అరెస్ట్ చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, దర్యాప్తు పూర్తయిన కారణంగా కస్టడీ అనవసరమని చెబుతూ బిభవ్ కుమార్ బెయిల్ కోసం కోర్టును అభ్యర్థించారు. ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలును వ్యతిరేకించారు. ఢిల్లీ పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ జైన్ మాట్లాడుతూ.. బిభవ్ కుమార్ అరెస్ట్ సమయంలో అన్ని చట్టపరమైన విధానాలు అనుసరించినట్టు చెప్పారు. అలాగే, హడావుడిగా తనను అరెస్ట్ చేశారని బిభవ్ కుమార్ చేసిన ఆరోపణలపై అరెస్ట్ మెమో అందించడం, అరెస్టుకు గల కారణాలను వివరించడం, బిభవ్ కుమార్ భార్యకు సమాచారం ఇవ్వడం వంటివి జరిగాయని పేర్కొన్నారు. 


Similar News