అయోధ్యలో ఓడించాం.. గుజరాత్లోనూ ఓడిస్తాం :రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో : ఈ లోక్సభ ఎన్నికల్లో అయోధ్య (ఫైజాబాద్)లో బీజేపీని ఓడించినట్టే.. 2027 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీసేనను కాంగ్రెస్ ఓడిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఈ లోక్సభ ఎన్నికల్లో అయోధ్య (ఫైజాబాద్)లో బీజేపీని ఓడించినట్టే.. 2027 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీసేనను కాంగ్రెస్ ఓడిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అయోధ్య లోక్సభ స్థానంలో పోటీ చేస్తే ఓటమి తప్పదని సర్వేల్లో తేలడంతో ప్రధాని మోడీ సేఫ్గా వారణాసి నుంచే పోటీ చేశారని విమర్శించారు. రాజ్కోట్ గేమింగ్ జోన్ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు గుజరాత్కు వచ్చిన రాహుల్ గాంధీ.. ఈసందర్భంగా శనివారం అహ్మదాబాద్లోని రాజీవ్ గాంధీ భవన్కు వెళ్లారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ ఉనికి, సిద్ధాంతం గుజరాత్లోనే పురుడు పోసుకున్నాయన్నారు. బ్రిటీషర్లు మన దేశాన్ని పీడిస్తున్నప్పుడు వెలుగుబాటలు చూపిన దార్శనికుడు మహాత్మా గాంధీ కూడా గుజరాతీయే అని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే.. కాంగ్రెస్లో ఎవరూ భయపడరు. బీజేపీలో మాత్రం మోడీని చూసి అందరూ భయపడుతున్నారు’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘అలనాడు అయోధ్య రామమందిరం కోసం అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర జరిగింది. కానీ రామమందిరం ప్రారంభోత్సవంలో మాత్రం అదానీ, అంబానీ కనిపించారు. పేదలు కనిపించలేదు. అయోధ్య ప్రజలు కనిపించలేదు’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.