కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల..

కేంద్రం వసూలు చేసే పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద చెల్లించాల్సిన నిధులను ఆర్థికశాఖ సోమవారం విడుదల చేసింది.

Update: 2023-06-12 12:27 GMT

న్యూఢిల్లీ : కేంద్రం వసూలు చేసే పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద చెల్లించాల్సిన నిధులను ఆర్థికశాఖ సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.1.18 లక్షల కోట్లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. జూన్‌ నెలకుగానూ మూడో విడత కింద మొత్తం రూ.1,18,280 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జూన్‌ నెలలో చెల్లించాల్సిన నిధులతో పాటు ఒక విడత అడ్వాన్స్‌ మొత్తాన్ని సైతం రాష్ట్రాలకు విడుదల చేసినట్లు పేర్కొంది.

ఈ మొత్తాన్ని మూలధన వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతానికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రధాన ప్రాజెక్టులు, స్కీముల అమలు కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగా పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు లభించాయి. కేంద్రం తాను వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో 14 విడతల్లో విడుదల చేస్తోంది.


Similar News