ఇరాన్‌కి వెళ్లొద్దు: కేంద్రం హెచ్చరిక

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2024-10-02 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్ నుంచి ఎవరూ అనవసరంగా ఇరాన్‌కు వెళ్లవద్దని, సాధ్యమైనంత వరకు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. యుద్ధం జరుగుతున్న దేశాల్లోని పరిస్థితులను, అక్కడి భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, భారత పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలు చేయకండని పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని సూచించింది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ భారీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హిజ్బుల్లా కమాండర్ ఇన్ చీఫ్ హసన్ నస్రల్లాను అంతమొందించినట్లు ప్రకటించింది. దీంతో ఇరాన్ ప్రభుత్వం అత్యవరసంగా సమావేశం కావడమే కాకుండా.. ఊహించని విధంగా దాదాపు 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. 


Similar News