'ఆర్టికల్ 370 రద్దు ముమ్మాటికీ సరైన నిర్ణయమే'.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది.
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు సోమవారం 20 పేజీల అఫిడవిట్ను సమర్పించింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ 2019, 2020 సంవత్సరాల్లో దాఖలైన 20కిపైగా పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం (జులై 11న) విచారించి, విచారణ షెడ్యూల్ను ఖరారు చేయనుంది.
దీనికి సరిగ్గా ఒకరోజు ముందు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ను సమర్పించడం గమనార్హం. "ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ అభివృద్ధి మొదలైంది. శాంతి చిగురించింది. రాళ్లదాడులు, ఉగ్రదాడులు ఒక గతంలా మిగిలిపోయాయి. ఇప్పుడు కాశ్మీర్లో వాటి ఊసే లేదు" అని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. రిజర్వేషన్ల అమలు, సంక్షేమ పథకాల అమలు, దేశ భాషలకు గుర్తింపు వంటివన్నీ ఇప్పుడు కాశ్మీర్లోనూ జరుగుతున్నాయని పేర్కొంది.