లంచం డబ్బులు మింగేసిన అధికారి..
మధ్యప్రదేశ్లో ఓ రెవెన్యూ అధికారి లంచం డబ్బులను నోట్లో వేసుకొని మింగేశాడు.
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ రెవెన్యూ అధికారి లంచం డబ్బులను నోట్లో వేసుకొని మింగేశాడు. కట్నీ జిల్లాలో రెవెన్యూ విభాగానికి చెందిన పట్వారీ గజేంద్ర సింగ్ ఓ భూమి కేసులో చందన్ సింగ్ లోధి నుంచి రూ.5000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు జబల్పూర్ లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ బృందానికి ఫిర్యాదు చేశాడు. వాళ్ల సూచన మేరకు గజేంద్ర సింగ్కు అతడి ప్రైవేట్ కార్యాలయంలో బాధితుడు రూ.4,500 ఇస్తుండగా మాటు వేసిన లోకాయుక్త జబల్పూర్ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
గజేంద్ర సింగ్ వెంటనే తన వద్ద ఉన్న కరెన్సీ నోట్లను మింగేశాడు. నిందితుడిని ఆస్పత్రికి తరలించడంతో అతడి నోటి నుంచి లంచం నోట్లను గుజ్జు రూపంలో కక్కించారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జిల్లా ఎస్పీ సంజయ్ సాహు చెప్పారు.