ఆ కంపనీ ఉద్యోగులకు కార్లు..బైక్ లు గిఫ్టులు

చెన్నైకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు దసరా థమాకా దక్కింది. కంపనీ అభివృద్ధికి కృషి చేసిన ఉద్యోగులకు ఆ సంస్థ యాజమాన్యం ఏకంగా కార్లు, బైకులు బహుమతిగా అందజేసింది.

Update: 2024-10-13 10:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : చెన్నైకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు దసరా థమాకా దక్కింది. కంపనీ అభివృద్ధికి కృషి చేసిన ఉద్యోగులకు ఆ సంస్థ యాజమాన్యం ఏకంగా కార్లు, బైకులు బహుమతిగా అందజేసింది. చెన్నైకి చెందిన టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ సంస్థ ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేసింది. కంపెనీని మరింత విజయపథంలోకి నడిపించేలా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు వారికి ఈ గిఫ్ట్‌లను అందించినట్లు అందించినట్లు టీమ్‌ డీటెయిలింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది. 28 మందికి కార్లు, 29 మంది ఉద్యోగులకు మోటార్‌ సైకిళ్లు అందించింది. కార్లలో హ్యుందాయ్‌, టాటా, మారుతీ సుజుకీ, మెర్స్‌డెస్‌ బెంజ్‌ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ కన్నన్‌ మాట్లాడుతూ కంపెనీని అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ గిఫ్ట్‌లను అందించినట్లు తెలిపారు. ఉద్యోగులే తమకు విలువైన ఆస్తి అని చెప్పిన ఆయన.. కంపెనీలో మొత్తం 180 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు. వారిలో చాలా మందికి కారు, బైక్‌ కొనుగోలు చేయాలన్న ఆశ ఉంటుందని, ఆ కల నెరవేర్చేందుకు వీటిని బహుమానంగా అందించినట్లు చెప్పారు.

అదే కాకుండా కంపెనీ అందించిన కారు, బైక్ కంటే ఇంకా మంచి వాహనం కొనుగోలు చేయాలని ఉద్యోగికి అనిపిస్తే మిగిలిన మొత్తం చెల్లించి కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కూడా ఉద్యోగులకు కల్పించినట్లు తెలిపారు. వివాహ వేడుకకు సాయం కింద రూ.50వేలు చెల్లించేవాళ్లమని, ఈ ఏడాది నుంచి ఆ మొత్తాన్ని రూ.1లక్షకు పెంచుతున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. సాధారణంగా ఏ కంపెనీ అయినా సరే పండుగలు, వార్షికోత్సవాల కానుకగా కొంత మొత్తం బోనస్ ఇస్తుంది. మరికొన్ని కంపెనీలు అయితే స్వీట్స్‌తో సరిపెట్టెస్తాయి. అయితే చెన్నైలోని ఈ సంస్థ అందరిని ఆశ్చర్యపరుస్తు కార్లు, బైక్ లు అందించడాన్ని చూసిన ఇతర కంపనీల ఉద్యోగులు తమకు కూడా ఇలాంటి భారీ బహుమతులు దక్కితే బాగుండనుకుంటూ టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ సంస్థ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.


Similar News