IndiGo: గాల్లో ఉండగా టాయిలెట్‌లో బాంబు బెదిరింపు.. లోపల 69 మంది..

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంస్థకు చెందిన ఒక విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది.

Update: 2024-09-01 13:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంస్థకు చెందిన ఒక విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం 7.55 గంటలకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నటువంటి ఫ్లైట్ 6E 7308 లోపల టాయిలెట్‌లో బాంబు ఉన్నట్లుగా రాసి ఉన్న పేపర్ కనిపించడంతో ఒక ప్రయాణికుడు ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే వారు విమానాశ్రయ అధికారులకు సమాచారం చేరవేశారు, తరువాత వారి సూచన మేరకు హైదరాబాద్‌కు రావాల్సిన విమానాన్ని మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌‌లో 9.20 గంటల సమయంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.

విమానం అక్కడ దిగేలోపు ముందుజాగ్రత్తగా ఎమర్జెన్సీ సిబ్బంది, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే చెకింగ్‌లో భాగంగా ఎలాంటి అనుమానస్పద పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 69 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి విమాన సంస్థ క్షమాపణలు కోరింది. వారందని కూడా ఇతర మార్గాల ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో విమానాశ్రయాలు, విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా రావడం గమనార్హం.


Similar News