పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్చార్జ్లు.. ప్రకటించిన నడ్డా
త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానా, జార్ఖండ్, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్తో సహా పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్చార్జ్, కోఇన్ చార్జ్లను శుక్రవారం ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానా, జార్ఖండ్, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్తో సహా పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్చార్జ్, కోఇన్ చార్జ్లను శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ చీఫ్ జేడీ నడ్డా జాబితాను వెల్లడించారు. హర్యానా ఇన్చార్జ్గా డాక్టర్ సతీష్ పూనియాను నియమించగా..ఎంపీ సురేంద్ర సింగ్ నగర్ కో-ఇన్చార్జిగా నియమితులయ్యారు. జమ్మూ కశ్మీర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను ఇన్చార్జ్గా, ఆశిష్ సూద్ను కో-ఇన్చార్జ్గా నియమించారు. జార్ఖండ్ ఇన్ చార్జిగా రాజ్యసభ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్పాయ్కు బాధ్యతలు అప్పటించారు. ఒడిశాలోని పూరీ నియోజకవర్గానికి చెందిన లోక్సభ ఎంపీ సంబిత్ పాత్రను ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా, కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ను జాయింట్ కోఆర్డినేటర్గా ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న బిహార్కు వినోద్ తావ్డే, ఎంపీ దీపక్ ప్రకాష్లను నియమించారు.
అలాగే మణిపూర్కు అజిత్ గోప్చాడే, నాగాలాండ్, మేఘాలయాలకు అనిల్ ఆంథోనీ, కేరళకు ప్రకాశ్ జవదేకర్, పంజాబ్కు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, హిమాచల్ ప్రదేశ్ ఇన్చార్జ్గా శ్రీకాంత్, అండమాన్ మరియు నికోబార్కు ఇన్చార్జ్గా రఘునాథ్ కులకర్ణి, అరుణాచల్ ప్రదేశ్కు అశోక్ సింగ్, ఛత్తీస్గఢ్కు నితిన్ నబిన్, కర్ణాటకలో రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఒడిశాకు విజయ్ పాల్ తోమర్, పుదుచ్చేరి ఇన్చార్జ్గా నిర్మల్ కుమార్, ఉత్తరాఖండ్ ఇంచార్జ్గా దుష్యంత్ కుమార్ వ్యవహరించనున్నారు.