బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ మరోదఫా పొడిగింపు

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడ్డాడనే కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ జ్యుడీషియల్ కస్టడీని న్యూఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జులై 6 వరకు పొడిగించింది.

Update: 2024-06-22 09:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడ్డాడనే కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ జ్యుడీషియల్ కస్టడీని న్యూఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జులై 6 వరకు పొడిగించింది. గత జ్యుడీషియల్ కస్టడీ జూన్ 22తో ముగిసిన నేపథ్యంలో శనివారం మెజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ ముందు బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచగా పోలీసుల తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు కస్టడీని మరోదఫా పొడిగించారు. కస్టడీ ముగిసిన తరువాత ఆయనను తిరిగి హాజరుపరచాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు సూచించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మే 13న కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మే 16 ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పటికే ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయగా దాన్ని కోర్టు కొట్టి వేయడంతో మే 18న అరెస్ట్ చేశారు. తరువాత కుమార్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా, ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. మే 24న, మరోసారి నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, ఆ తర్వాత మళ్లీ మూడు రోజులకు, తరువాత జూన్ 1న14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తిరిగి జూన్ 22 వరకు కస్టడీ పొడిగించగా, తాజాగా ఆ గడువు ముగియడంతో మరోసారి కస్టడీని జులై 6 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News