నీట్ పేపర్ లీక్ కేసులో మరొకరి అరెస్ట్.. జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్న సీబీఐ
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరొక నిందితుడిని అరెస్టు చేసింది. జార్ఖండ్లోని ధన్ బాద్లో అమన్ సింగ్ అనే వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరొక నిందితుడిని అరెస్టు చేసింది. జార్ఖండ్లోని ధన్ బాద్లో అమన్ సింగ్ అనే వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకుంది. పేపర్ లీక్ లో అమన్ కీలక సూత్రధారిగా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో నీట్ కేసులో అరెస్టైన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. అయితే గతంలో అరెస్టు చేసిన వారిని విచారించగా అమన్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యలు చేపట్టిన సీబీఐ అమన్ సింగ్ను పట్టుకుంది. అమన్ను సైతం బిహార్ లోని పాట్నాకు తీసుకొచ్చి అక్కడే ఇన్వెస్టిగేషన్ చేసి అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది. కాగా, నీట్ యూజీ పేపర్ లీక్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు విమర్శలు గుప్పించగా.. కేంద్రం సీబీఐ ఎంక్వయిరీ చేపట్టింది. ఈ కేసులో సీబీఐ ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.