నాలుగేళ్ల తర్వాత ఇంటికి.. టేకాఫ్‌కు ముందే విమానంలో మృతి చెందిన మహిళ

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇండియాలో ఉన్న తన కుటుంబాన్ని చూడాలని ఎంతో సంతోషంతో విమానం ఎక్కిన మహిళ, ఆ కోరిక తీరకుండానే విమానంలో తన సీటులోనే చనిపోయిన విషాదకర ఘటన ఇటీవల చోటు చేసుకుంది

Update: 2024-07-01 13:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇండియాలో ఉన్న తన కుటుంబాన్ని చూడాలని ఎంతో సంతోషంతో విమానం ఎక్కిన మహిళ, ఆ కోరిక తీరకుండానే విమానంలో తన సీటులోనే చనిపోయిన విషాదకర ఘటన ఇటీవల చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, భారత సంతతికి చెందిన 24 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్, నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా ఇండియాలోని తన కుటుంబాన్ని చూడటానికి జూన్ 20న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం ఎక్కింది. లోపల తన సీటు బెల్ట్ పెట్టుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే విమాన సిబ్బంది ఆమెను కాపాడటానికి అత్యవసర వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించినప్పటికి అప్పటికే మన్‌ప్రీత్ కౌర్ మృతి చెందారు.

ఆమె స్నేహితుడు, గురుదీప్ గ్రేవాల్ మాట్లాడుతూ, విమానం ఎక్కే ముందు కూడా ఆమె ఆరోగ్యంగానే ఉంది. కానీ లోపల కూర్చున్నాక సీట్‌బెల్ట్ ధరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె అశ్వస్థకు గురై కుప్పకూలిపోయి మరణించిందని తెలిపాడు. ఆమె మరణానికి కారణం క్షయవ్యాధి అయి ఉండవచ్చని తెలుస్తోంది. మన్‌ప్రీత్ కౌర్ మృతదేహాన్ని ఇండియాలోని స్వగ్రామానికి తరలించడానికి గ్రేవాల్ నిధుల సేకరణ చేస్తున్నారు. ఆమె 2020 మార్చిలో ఆస్ట్రేలియాకు వెళ్లారు. మన్‌ప్రీత్ ఆస్ట్రేలియా పోస్ట్‌లో పనిచేస్తున్నట్లు, చెఫ్ కావాలనుకుంటున్నారని ఆమె స్నేహితుడు పేర్కొన్నాడు.


Similar News