గూగుల్ లొకేషన్ షేర్ చేయాలని నిందితులను ఆదేశించలేము..సుప్రీంకోర్టు
బెయిల్ మంజూరు టైంలో ఒక షరతుగా నిందితుడు తన గూగుల్ లొకేషన్ను అధికారులతో పంచుకోవాలని కోర్టులు ఆదేశించలేవని సుప్రీంకోర్టు వెల్లడించింది.
దిశ, నేషనల్ బ్యూరో: బెయిల్ మంజూరు టైంలో ఒక షరతుగా నిందితుడు తన గూగుల్ లొకేషన్ను అధికారులతో పంచుకోవాలని కోర్టులు ఆదేశించలేవని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ షరతులు గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడింది. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నైజీరియన్ ఫౌరుడు ఫ్రాంక్ విటస్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. అందులో నిందితుడు ఎల్లప్పుడూ దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని, ఈ మేరకు గూగుల్ లోకేషన్ పంచుకోవాలని నిబంధన పెట్టింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ధర్మాసనం విచారణ చేపట్టి పై వ్యాఖ్యలు చేసింది. బెయిల్ మంజూరు ఉద్దేశ్యాన్ని భంగపరిచే బెయిల్ షరతులను ఏ కోర్టు విధించబోదని పేర్కొంది. సాంకేతికత ద్వారా ప్రతి కదలికపై నిరంతర నిఘా ఉంచలేమని నొక్కి చెప్పింది.