RG Kar ex-principal : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ కి షాక్ ఇచ్చిన సీబీఐ కోర్టు
కోల్కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో: కోల్కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. సందీప్ ఘోష్ కి బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం గనుక రుజువైతే మరణశిక్ష తప్పదని స్పష్టం చేసింది. సాక్ష్యాధారాలు తారుమారు చేశారనే ఆరోపణల్లో డాక్టర్ సందీప్ ఘోష్, తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి అభిజిత్ మెండల్ సీబీఐ కస్టడీలో ఉన్నారు. వీరు బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సందీప్ ఘోష్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ.. కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థనని తిరస్కరించింది. ‘‘సందీప్ ఘోష్పై ఉన్న నేరారోపణ తీవ్రమైంది. ఈ కేసులో ఆయన్ని బెయిల్పై విడుదల చేయడం న్యాయపరంగా వీలు కాదు. ఒకవేళ ఆయనపై ఆరోపణ రుజువైతే గనుక.. అత్యంత అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాల్సి వస్తుంది’’ అని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వ్యాఖ్యానించారు. అలాగే.. అభిజిత్ మెండల్ బెయిల్ పిటిషన్ను సైతం కోర్టు తోసిపుచ్చింది.
కస్టడీ పొడిగింపు
ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితుల కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30 వరకు కస్టడీకి ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఆగష్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ పై హత్యచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు తారుమారుచేసేందుకు యత్నించారని సందీప్ పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి అభిజిత్ మెండల్పైనా కేసు నమోదు చేసింది. ఘటన తర్వాత ఇద్దరూ టచ్ లో ఉన్నట్లు తేల్చింది. కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లలో సందీప్.. ఇన్ స్పెక్టర్ కి సూచనలు చేయించినట్లు గుర్తించింది. వీళ్లిద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపేందుకు యత్నించారని అరెస్టు చేసింది.