Criminal Cases: దేశవ్యాప్తంగా ఉన్న 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో (MLAs) 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) ఉన్నాయి. 28 రాష్ట్రాలు/యూటీ అసెంబ్లీలకు చెందిన మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది ఎన్నికల అఫిడవిట్ లో దాఖలు చేసిన వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సేకరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో (MLAs) 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) ఉన్నాయి.28 రాష్ట్రాలు/యూటీ అసెంబ్లీలకు చెందిన మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది ఎన్నికల అఫిడవిట్ లో దాఖలు చేసిన వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సేకరించింది. వారి క్రిమినల్ రిపోర్ట్ ను ఏడీఆర్ వెలికితీసింది. ఆ రిపోర్టు ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల్లో దాదాపు 45 శాతం అంటే 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 29 శాతం మంది అంటే.. 1,205 మంది ఎమ్మెల్యేలు హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితాలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, బిహార్ ఉన్నాయి. ఆంధ్ర్రప్రదేశ్ ఎమ్మెల్యేలు అత్యధిక శాతం (174 మందిలో 138 మంది) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, తెలంగాణలలో 69 శాతం, బీహార్ రాష్ట్రం 66 శాతం, మహారాష్ట్రలో 65 శాతం, తమిళనాడులో 59 శాతంతో ఉన్నాయి.
పార్టీల వారీగా..
పార్టీల వారీగా చూస్తే.. ఏపీలోని తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా 86 శాతం (134 మందిలో 115 మంది శాసనభ్యులు) మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, టీడీపీకి చెందిన 61 శాతం మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల్లో దాదాపు 39 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. 26 శాతం మందిపై తీవ్రనేరారోపణలు ఉన్నాయి. ఇక 646 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో (52%) 339 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 194 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు అధికార డీఎంకేలో 74 శాతం (132 మందిలో 98) మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 42 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేల్లో దాదాపు 41 శాతం అంటే 230 మందిలో 95 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 78 మంది (34%) తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక మొత్తంగా 54 మంది ఎమ్మెల్యేలు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, 226 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అంతేకాదు 127 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 13 మంది లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఏడీఆర్ ఎమ్మెల్యేల ఆర్థిక వివరాలను కూడా వెల్లడించింది. 119 మంది ఎమ్మెల్యేలను (3శాతం) బిలియనీర్లుగా పేర్కొంది. అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.17.92 కోట్లు అని… అయితే, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఆస్తులు రూ.20.97 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.