అమర్‌నాథ్ యాత్రకు ఆరు రోజుల్లోనే 1.30 లక్షల మంది

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రఖ్యాత అమర్‌నాథ్ గుహలో శివున్ని సందర్శించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

Update: 2024-07-05 06:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రఖ్యాత అమర్‌నాథ్ గుహలో శివున్ని సందర్శించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో దాదాపు 1.30 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. గురువారం ఒక్క రోజే 24,000 మంది యాత్రికులు దర్శనం చేసుకోగా, బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. శుక్రవారం ఉదయం ఎనిమిదో బ్యాచ్‌లో 6919 మంది యాత్రికులు జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్, అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్-పహల్గామ్ జంట బేస్ క్యాంపుల వైపు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో యాత్ర మార్గంలో అడుగడుగున భద్రతా దళాలను మోహరించారు. ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమైన యాత్ర ఆగస్టు 19న 52 రోజుల పాటు కొనసాగనుంది. గత ఏడాది 2023లో 4.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రకు రాగా, ఈ సారి అంతకంటే ఎక్కువ మంది వస్తారని అధికారులు అంచనా వేశారు.


Similar News