ఎట్టకేలకు తెలంగాణకు వైజయంతి మూవీస్ విరాళం
తెలంగాణ వరద బాధితుల సహాయార్థం వైజయంతి మూవీ నిర్మాత అశ్వినీ దత్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ వరద బాధితుల సహాయార్థం వైజయంతి మూవీ నిర్మాత అశ్వినీ దత్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు. రెండ్రోజుల క్రితమే ఏపీకి రూ.25 లక్షల సాయం చేసిన ఆయన.. బుధవారం సాయంత్రం తెలంగాణకు రూ.20 లక్షలు ప్రకటించారు. అయితే, ఏపీకి ప్రకటించినప్పుడే తెలంగాణకు ప్రకటించకపోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని సోషల్ మీడియా వేదికగా ఆయనపై అసహనాన్ని వెళ్లగక్కారు.
కాగా, వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. వరద చుట్టుముట్టడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం రెండు రాష్ట్రాల్లో సంభవించింది. ఆపత్కాలంలో బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు అందిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఇండస్ట్రీ(Industry) నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ మొత్తంలో సాయం అందింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.6 కోట్లు ప్రకటించారు. ప్రభాస్ సైతం రెండు కోట్లు అందించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి, జూనియర్ ఎన్టీఆర్ కోటి, మహేశ్ బాబు కోటి, అల్లు అర్జున్ కోటి సహా అనేక మంది విరాళాలు ప్రకటించారు.