పీరియడ్స్ పండుగ... రుతుస్రావాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఒడిశా

భారత సమాజం పీరియడ్స్ ను ఒక కళంకంగా భావిస్తుంది. దాని గురించి మాట్లాడటాన్ని నిషేధిస్తుంది. ఆ మూడు రోజులను దాచాలని.. స్త్రీలు రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది.

Update: 2024-06-23 15:42 GMT

దిశ, ఫీచర్స్: భారత సమాజం పీరియడ్స్ ను ఒక కళంకంగా భావిస్తుంది. దాని గురించి మాట్లాడటాన్ని నిషేధిస్తుంది. ఆ మూడు రోజులను దాచాలని.. స్త్రీలు రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. ఇతరులను ముట్టుకోవద్దని గదికే బంధిస్తుంది. టీవీలో న్యాప్కిన్ యాడ్ వస్తే ఛానల్ మార్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉన్న దేశంలో ఒడిశా రాష్ట్రం మాత్రం ఋతుస్రావంను సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రతి ఏటా పండగ నిర్వహిస్తుంది. దీన్ని 'రాజా పర్బ' లేదా 'మిథున సంక్రాంతి' అని పిలుస్తుండగా.. ఈ ఫెస్టివల్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.

ఈ పండుగను వర్షాకాలం ప్రారంభానికి గుర్తుగా చెబుతారు. ఈ కాలంలో భూమి ఋతు చక్రం గుండా వెళుతుందని విశ్వసిస్తూ.. స్త్రీ లింగ అంశాలను గౌరవిస్తుంది. 'రాజా' అనే పదం 'రజస్వల' నుంచి తీసుకోబడగా.. 'ఋతుస్రావంతో ఉన్న స్త్రీ' అని అర్థం. రాజా పండుగ మూడు రోజుల పాటు జరుపుకుంటుండగా.. ప్రతి రోజు దాని సొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

ఇతర భారతీయ పండుగలు లేదా సందర్భాల మాదిరిగానే.. రాజా పర్బకు సంబంధించి కూడా ఒక పురాణం ఉంది. స్త్రీ శక్తికి ప్రతిరూపమైన భూమి తల్లిగా పిలవబడేది. జూన్ మధ్యలో మూడు రోజులు ఋతుస్రావం గుండా వెళుతుందని చెబుతారు. పండుగ మొదటి రోజు 'పహిలి రాజా', రెండవ రోజు 'రాజ సంక్రాంతి', మూడవ రోజు 'బసి రాజా'గా జరుపుకుంటారు. ఆ తరువాత రోజు..'వసుమతీ స్నాన' అని పిలుస్తారు. ఆ రోజు భూమి శక్తి లేదా 'భూదేవి' కర్మ స్నానం చేసి.. ఆమె కాల చక్రాన్ని ముగిస్తుంది. కాగా ఒడిశాలో రాజా పండుగ వేడుకలు 'భూదేవి' మనకు ఇచ్చే సారవంతమైన భూమిని గౌరవించటానికి, మంచి పంట కోసం ప్రార్థించే మార్గం.

రాజా పర్బ అనేక విభిన్న కార్యక్రమాలతో జరుపుకుంటారు. పహిలి రాజా, రాజా సంక్రాంతి, బసి రాజా రోజున.. మహిళలు తమ రోజువారీ పనుల నుంచి విరామం తీసుకుంటారు. శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. కొత్త బట్టలు, సాంప్రదాయ ఆభరణాలు ధరించి.. వారి పాదాలకు ఆల్తాను పూసుకుంటారు. ఇది భూమితో వారి అనుబంధానికి చిహ్నం. కాగా అమ్మాయిలు, స్త్రీలు.. ఊయలను అలంకరించి ఊగుతూ ఆడుకుంటారు. జానపద పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు.


Similar News