తిరుపతి స్థానం మాకంటే మాకు..

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతి ఎంపీ స్థానం తమకే కావాలంటూ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలు కుస్తీ పడుతున్నాయి. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తుందని, పొత్తు విషయమై తమను ఎవరూ సంప్రదించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని అంతా భావించారు. కానీ, […]

Update: 2020-11-24 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతి ఎంపీ స్థానం తమకే కావాలంటూ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలు కుస్తీ పడుతున్నాయి. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తుందని, పొత్తు విషయమై తమను ఎవరూ సంప్రదించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

దీంతో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని అంతా భావించారు. కానీ, అనుహ్యంగా తాము పోటీ నుంచి విరమించుకున్నట్లు పవన్ తెలిపారు. కారణం, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి జనసేన మిత్రపక్షంగా కొనసాగుతున్నది. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే ఓట్లు ఎక్కడ చీలుతాయో అని భావించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కలిసి పవన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలోని తిరుపతి ఉపఎన్నిక స్థానంలో జనసేన పోటీచేయాలని భావిస్తోంది. తిరుపతిలో తమకు గట్టి పట్టు ఉందని, ఎంపీ స్థానాన్ని సులువుగా గెలుస్తామని జనసేన కార్యకర్తలు, నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని స్థానిక లీడర్లు బెట్టు చేస్తున్నారు. జనసేనకు తిరుపతి స్థానాన్ని ఇవ్వబోమని మాకే కావాలని ఇటు బీజేపీ, కాదు మాకే కావాలని జనసేన నేతల మధ్య కుస్తీ నడుస్తోంది. బీజేపీ సీనియర్ లీడర్ జీవీఎల్ సైతం తిరుపతిలో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని చెబుతున్నారు.

అయితే, ఎలాగైనా తిరుపతిలో పోటీ చేయాలని జనసేన మొండిపట్టు పట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నందుకు గానూ తమకు తిరుపతిలో ఛాన్స్ ఇవ్వాలని పవన్ బీజేపీ అగ్రనాయకత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. అందుకోసమే మంగళవారం ఉదయం పవన్ ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇదే విషయమై భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, పవన్ డిమాండ్స్‌కు కషాయనేతలు కరుగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ జనసేన ప్రపోసల్ ను బీజేపీ కాదంటే పవన్ ఏ స్టెప్ తీసుకుంటారో అన్న అంశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News