చితకబాది, చిత్రీకరించి.. యువకుడిపై మూకుమ్మడి దాడి..అవమానంతో ఆత్మహత్య

యువకుడిని విచక్షణ రహితంగా చితకబాది, ఆపై చిత్రీకరించి అవమాన

Update: 2024-09-22 09:06 GMT

దిశ,చందుర్తి : యువకుడిని విచక్షణ రహితంగా చితకబాది, ఆపై చిత్రీకరించి అవమాన పరిచిన ఘటనలో బాధిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూత్రం ఆంజనేయులు(22) అనే యువకుడు వేములవాడలోని ఓ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మద్యం మత్తులో గ్రామంలోని ఒకరికి చెందిన ఇంటిపై టపాసులు విసిరాడు.

దీంతో ఆగ్రహం చెందిన సదరు ఇంటికి సంబంధించిన యువకులు, వారి స్నేహితులు సుమారు 5 నుంచి 10 మంది కలిసి ఆంజనేయులుపై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా దృశ్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఇదే విషయమై ఇంటి వారికి క్షమాపణ చెప్పాలని భావించిన ఆంజనేయులు మరుసటి రోజు ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ సైతం గొడవ జరిగింది. మళ్ళీ అక్కడున్న యువకులు ఆంజనేయులపై దాడి చేశారు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన ఆంజనేయులు గత వారం రోజులుగా ఇంటికి రాకుండా, ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకు దూరంగా ఉంటూ కాలం గడుపుతున్నాడు. ఈ క్రమంలో దాడి వార్త ఊరంతా వ్యాపించి, చర్చ మొదలైంది.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆంజనేయులు అవమాన భారంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తన కుమారుడి మృతికి కారణమైన యువకులను పట్టుకొని, కేసులు నమోదు చేసిన తర్వాతే మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించాలని ఆంజనేయులు తల్లి రాజవ్వ కోరుతుంది.


Similar News