Manipur Students’ Killing: మణిపూర్ విద్యార్థుల మర్డర్ కేసులో నలుగురు అరెస్ట్..

మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

Update: 2023-10-01 16:10 GMT

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. జూలై నెలలో అదృశ్యమైన మైతై వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు దారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన సైన్యం, పోలీసులు కుకీ ప్రాబల్యం ఉన్న చురచంద్‌పూర్ లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నలుగురిని అరెస్టు చేశాయి. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ కేసుతో సంబంధమున్నట్లుగా భావిస్తున్న ఇద్దరు బాలికలు కూడా సీబీఐ అదుపులో ఉన్నారు. ఈ ఆరుగురిని పట్టుకున్న వెంటనే ఇంఫాల్ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చి సీబీఐ అధికారులకు అప్పగించారు.

ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు విమానం ద్వారా వారందరిని సురక్షితమైన దర్యాప్తు నిమిత్తం అస్సాంలోని గౌహతికి తీసుకెళ్లారు. ఈ అరెస్టుల గురించి తెలుసుకున్న కొందరు ఇంఫాల్ ఎయిర్ పోర్టు వైపు వచ్చే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హత్యకు గురైన విద్యార్థిని స్నేహితుడు లింగ్‌నీచాంగ్ బైట్ కూడా నిందితుల లిస్టులో ఉన్నాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.మయన్మార్ సర్జికల్ స్ట్రైక్ కు నాయకత్వం వహించిన కల్నల్(రిటైర్డ్) నెక్టార్ సంజెన్‌బామ్ నాయకత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. కాగా, ‘‘నేరం చేసి తప్పించుకున్న వారు ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారు. ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తాం’’ అని పేర్కొంటూ మణిపూర్‌ సీఎం బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News