పెద్దకర్మకు వెళ్లి వస్తుండగా అనంతలోకాలకు..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలైన

Update: 2024-10-28 15:23 GMT

దిశ, ఖమ్మం రూరల్ : రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఆవుల లక్ష్మీనారాయణ (60), ఆవుల పద్మ (55) భార్య భర్తలు. ఇరువురు తోడేలగూడెం గ్రామంలో బంధువుల ఇంట్లో పెద్దకర్మ ఉండగా వెళ్లి వస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ సమీపంలో ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై వెళుతుండగా ఖమ్మం నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది.

భర్త లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మీనారాయణకు ఖమ్మం సిటీ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Similar News