విషాదం.. కుక్కను తరుముతూ అనంతలోకాలకు..

ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుదామని హోటల్ కు వెళ్లిన

Update: 2024-10-22 05:06 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుదామని హోటల్ కు వెళ్లిన యువకుడు, మూడవ అంతస్తు నుంచి కింద పడి మరణించిన ఘటన ఆదివారం రాత్రి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. చందానగర్ సీఐ పాలవెల్లి, మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తెనాలికి చెందిన ఉదయ్ (23) కుటుంబ సభ్యులు నగరానికి వచ్చి రామచంద్రపురం అశోక్ నగర్ లో ఉంటున్నారు. ఉదయ్ పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఆదివారం తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చందానగర్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న వీవీ ప్రైడ్ అనే హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ లోని మూడవ అంతస్తు బాల్కానీలోకి వెళ్లి కుక్కను తరుముతూ పోయి బాల్కనీ కిటీకి నుండి పడిపోయాడు. మూడవ అంతస్తు  నుండి బయటకు పడిపోయిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ దృశ్యాలు అన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు పొక్కకుండా దాయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. వీవీ ప్రైడ్ హోటల్ లో ఘటన జరిగినా ఎందుకు దాచారు. ఎవరికి తెలియకుండా ఎందుకు మేనేజ్ చేశారు. అనేదానిపై అనేక అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. అసలు హోటల్ మూడవ అంతస్థులోకి కుక్క ఎలా వెళ్లింది. ఎవరు తీసుకువెళ్లారు. వీధి కుక్క అయితే అక్కడి వరకు వెళ్లినా హోటల్ సిబ్బంది ఎందుకు ఉపేక్షించారు ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీవీ ప్రైడ్ హోటల్ మూడవ అంతస్తు నుంచి యువకుడు పడిపోయి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాలవెల్లి తెలిపారు.


Similar News