దొంగల హల్చల్.. ఒకే రోజు రెండు కాలనీలలో దొంగతనం
సూర్యాపేట పట్టణం లో అర్ధరాత్రి దొంగల హల్ చల్ చేశారు.
దిశ,సూర్యాపేట టౌన్ : సూర్యాపేట పట్టణం లో అర్ధరాత్రి దొంగల హల్ చల్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఏకంగా రెండు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని బాలాజీ నగర్ కాకతీయ స్కూల్ పక్కన ఇంట్లో దొంగతనం చేసి రూ. 60 వేల నగదు, శ్రీరామ నగర్ లో మూడు తులాల బంగారం, మరో ఇంటి లో రూ.6 వేల నగదు స్వాహా చేశారు. అలాగే కిరాణం షాప్ లో, మరో రెండు ఇండ్లలో చోరీ చేశారు.మరో ఇంట్లో ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.60 వేల నగదు అపహరించుకుపోయారు.
కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోవడంతో అసలు విషయం తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించారు. దొంగతనం జరగడంతో ఒక్కసారిగా కాలనీవాసులు ఉలిక్కిపడుతున్నారు. బాలాజీ నగర్,శ్రీరామ్ నగర్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన బంగారు నగలు, నగదు ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఒకే రోజు రెండు కాలనీలలో దొంగతనం జరగడంతో పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు.