ఒరిస్సా టు ముంబాయికి గంజాయి రవాణాకు స్కెచ్
భువనేశ్వర్ నుంచి ముంబాయికి కోణార్క్ రైల్లో అక్రమంగా రవాణా అవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం ఎస్టీఎఫ్డీ టీమ్ పోలీసులు ఘట్కేసర్ లో పట్టుకున్నారు.

దిశ, ఘట్కేసర్ : భువనేశ్వర్ నుంచి ముంబాయికి కోణార్క్ రైల్లో అక్రమంగా రవాణా అవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం ఎస్టీఎఫ్డీ టీమ్ పోలీసులు ఘట్కేసర్ లో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఒరిస్సాకు చెందిన దాంపా ప్రధాన్ అనే గంజాయి వ్యాపారి ముంబాయికి 10 కిలోల గంజాయిని తరలించడానికి నందిగోస నాహక్(21) అనే వ్యక్తిని ఏర్పాటు చేశాడు. భువనేశ్వర్ నుంచి ముంబాయిలో గంజాయి ఇచ్చి వచ్చినందుకు నాహక్కు రూ.15 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంతో నిందితుడు కోణార్క్ రైల్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయనే సమాచారంతో కోణార్క్ దిగి కాకతీయ రైలు ఎక్కాడు.
కాకతీయ రైల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయనే భయంతో ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో గంజాయితో దిగాడు. బస్సు మార్గంలో కానీ మరో రైల్లో కానీ ముంబాయికి వెళ్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్టీఎఫ్డీ టీమ్ సీఐ నాగరాజ్, ఎస్సై జ్యోతి, సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న రూ.5 లక్షల విలువ చేసే 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడు నందిగోస నాహక్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్లో కానిస్టేబుళ్లు లేఖాసింగ్, వినోద్, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తిరుపతి యాదవ్ అభినందించారు.