అక్రమ వసూళ్ల కోసమే పైలట్ డ్యూటీలు.. ట్రాఫిక్ పోలీసు వర్గాల్లో చర్చ!

గ్రేటర్ హైదరాబాద్‌లోని ట్రై పోలీసు కమిషనరేట్‌లోని ట్రాఫిక్ విభాగంలో పైలట్ డ్యూటీలపై సిబ్బందిలో కోల్డ్ వార్ నడుస్తోంది.

Update: 2024-09-26 02:06 GMT

దిశ సిటీ,క్రైం:గ్రేటర్ హైదరాబాద్‌లోని ట్రై పోలీసు కమిషనరేట్‌లోని ట్రాఫిక్ విభాగంలో పైలట్ డ్యూటీలపై సిబ్బందిలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ పైలట్ డ్యూటీ అంటేనే అక్రమ వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అంటూ ట్రాఫిక్ పోలీసు వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ట్రాఫిక్ విధుల నిర్వహణలో అందరూ నిజాయితీగా పని చేయాలని చెప్పే అధికారులే వారికి నచ్చిన కానిస్టెబుల్‌ను పైలట్‌గా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారులు వారికి నచ్చిన వారిని రోడ్డు మాస్టర్‌గా పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్‌లో పైలట్ అంటూ నమ్మిన బంటును పెట్టుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే టాపిక్ పై విభాగంలోని సిబ్బంది, అధికారులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.

పైలట్ అంటే..

ట్రాఫిక్ విభాగంలోని ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు వారికి సన్నిహితంగా ఉన్న వారిని పైలట్లుగా నియమించుకుంటారు. వారి ద్వారా సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిని రూట్ చేసుకుంటారు. నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలను అనుమతించాలన్నా, చలాన్‌లు వేయకుండా ఉలంఘనలపై చూసిచూడనట్లు ఉండడానికి పైలట్లు ముందు ఉంటారు. పైలట్ ఒకే అంటే సంబంధిత ట్రాఫిక్ అధికారి సై అన్నట్లేనని ట్రాఫిక్ పోలీసు వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు పైలట్ డ్యూటీలకు అధికంగా ఏఆర్ కానిస్టెబుల్‌లను పెట్టుకోవడంతో వారి దూకుడు వ్యవహరంతో మిగతా సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇలా ట్రాఫిక్ విభాగంలో ఏఆర్, సివిల్ పోలీసుల మధ్య ఈ పైలట్ వ్యవహారం విబేధాలకు దారి తీస్తుందని ట్రాఫిక్ వర్గాలు చెబుతున్నాయి. అధికంగా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పైలట్‌ల వసూళ్లు నెలకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని ట్రాఫిక్ పోలీసు వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఒకసారి పైలట్‌తో డీల్ ఓకే అయ్యిందంటే చాలు శివారు ప్రాంతాల్లో భారీ వాహనాలకు నో ఎంట్రీ సమయంలో కూడా ఎంట్రీలు ఇస్తూ బ్రేక్ లేకుండా ప్రయాణిస్తుంటాయని సమాచారం. ఉన్నతాధికారులు ఈ పైలట్ వ్యవస్థ పై ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఇతర విభాగాల నుంచి వచ్చిన కానిస్టెబుళ్లు, అధికారులు వారి విధుల్లో భాగంగా చాలా చోట్ల నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలను ఎంట్రీ ఇచ్చినప్పుడు వారి పత్రాలను తనిఖీ చేసే సమయంలో వారు సార్.. సార్.. మేము ఫలానా అధికారి పైలట్‌ను కలిశామని చెప్పడంతో సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు ట్రాఫిక్ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News