యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదు.. కారణమిదే?
ఇటీవల కాలంలో చాలా మంది యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పులు తీర్చలేక ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
దిశ,వెబ్డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పులు తీర్చలేక ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ను కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా.. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదైంది. ఈ విషయాన్ని సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ మాట్లాడినందునే అతడిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.
ఇటీవల హర్ష సాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను బెట్టింగ్ యాప్స్ ను చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నాను. నేను చేయకపోతే ఇతరులు ప్రమోట్ చేస్తారని.. ఆ డబ్బును ఎందుకు పోగొట్టుకోవడం.. అందుకే బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు.. ఆ విధంగా వచ్చిన డబ్బును పేదలకు పంచుతున్నానని వెల్లడించాడు’’ ఈ వీడియోను చూసిన సజ్జనార్ చేసేదే తప్పు అదేదో సంఘ సేవ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని హర్ష సాయి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.