వరుసగా రెండో నెలా వెయ్యి కోట్ల యూపీఐ లావాదేవీలు!

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి.

Update: 2023-10-02 16:24 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా సెప్టెంబర్‌లో ఏకంగా 1,056 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం, ఆగష్టులో నమోదైన 1,058 కోట్ల కంటే లావాదేవీల సంఖ్య కంటే తగ్గాయి. దాంతో వరుసగా రెండవ నెల 1,000 కోట్ల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు జరిగాయి. విలువ ప్రకారం, సెప్టెంబర్‌లో జరిగిన యూపీఐ లావాదేవీల విలువ రూ. 15.80 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆగష్టులో రూ. 15.76 లక్షల కోట్ల కంటే స్వల్పంగా పెరిగాయి.

డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగేందుకు ప్రధానంగా పర్సన్-టూ-మర్చంట్(పీ2ఎం) లావాదేవీల వృద్ధే కారణమని ఎన్‌పీసీఐ అభిప్రాయపడింది. ఆగష్టు నాటికి ఎన్‌పీసీఐ డేటా ప్రకారం, ఫోన్‌పే దాదాపు 500 కోట్ల యూపీఐ లావాదేవీలను నమోదు చేసింది. ఇది మొత్తం యూపీఐ లావాదేవీల్లో 47 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత గూగుల్‌పే 380 కోట్లు, పేటీఎం 150 కోట్ల లావాదేవీలను కలిగి ఉన్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం, దేశంలో యూపీఐ లావాదేవీలు 2026-27 నాటికి రోజుకు 100 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇవి దేశంలోని రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 90 శాతానికి సమానం.


Similar News