Banking Laws: బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024 ను ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టారు

Update: 2024-08-09 09:25 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024 ను ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955, వంటి వాటిని సవరించడానికి ఉద్దేశించింది. దీనిలోనే బ్యాంకు ఖాతాల నామినీల సంఖ్యను నలుగురి వరకు పెంచేలా అనుమతించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అలాగే, బ్యాంక్ డైరెక్టర్‌షిప్‌ల కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 2 కోట్లకు పెంచేలా బిల్లులో పేర్కొన్నారు.

ఆర్థిక నిర్వహణలో ఎక్కువ స్వేచ్ఛను అందించేందుకు చట్టబద్ధ ఆడిటర్లకు వేతనాన్ని నిర్ణయించడంలో బ్యాంకులకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించేందుకు సవరణలు బిల్లులో ఉన్నాయి. ఇంకా బ్యాంకుల రిపోర్టింగ్ తేదీలను కూడా మార్చే ప్రతిపాదనలు బిల్లులో రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రతి నెల రెండవ, నాల్గవ శుక్రవారాల నుంచి దానిని ప్రతి నెల 15వ, చివరి రోజుకి మారాలని ప్రతిపాదించారు. సహకార బ్యాంకుల్లో చైర్మన్, పూర్తికాల డైరెక్టర్ల పదవీకాలాన్ని 8 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పొడిగించడం గురించి కూడా బిల్లులో ప్రతిపాదించారు.

Tags:    

Similar News