Nominee: డిపాజిట్ ఖాతాకు నలుగురు నామినీలు.. కేంద్రం కీలక నిర్ణయం

క్లెయిమ్ చేయని డిపాజిట్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-03 10:46 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: క్లెయిమ్ చేయని డిపాజిట్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి డిపాజిట్ ఖాతాకు నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అనుమతించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా ఖాతాదారుడు మరణించిన తరువాత నామినీగా ఉన్న జాయింట్ ఖాతాదారులు లేదా వారసులకు ఆ డబ్బులను అందించడానికి వీలవుతుంది. అలాగే, వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాలకు సంబంధించిన అనేక సవరణలను కూడా కేంద్రం ఆమోదించింది.

ప్రస్తుతం బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం ఒకరిని మాత్రమే నామినీగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. వీటిని పెంచాలని చాలా కాలంగా ప్రభుత్వానికి వినతులు వస్తుండగా, తాజాగా ఇప్పుడు కేంద్రం శుభవార్త చెప్పింది. దీని వలన క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఎక్కువ మంది నామినీలను పెట్టుకోడానికి వీలుంది.

కొత్త నిర్ణయంతో బీమా వంటి వాటిలో కూడా మార్పులు రానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత కొంత కాలంగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు, ఇతర డిపాజిట్లలో క్లెయిమ్ చేయని అమౌంట్ భారీగా పేరుకుపోతుంది. డిపాజిట్లు చేసిన వారి వారసులు ఎవరూ రాకపోవడంతో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చి, 2024 చివరి నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.78,000 కోట్లకు పెరిగాయి.

Tags:    

Similar News