హారియర్, సఫారీ బేసిక్ మోడల్ ధరలు తగ్గించిన టాటా మోటార్స్
కంపెనీ తన ఎస్యూవీ వేరియంట్లపై రూ. 1.40 లక్షల వరకు ప్రయోజనాలు కూడా పొడిగిస్తున్నట్టు తెలిపింది
దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన రెండు ప్రీమియం ఎస్యూవీ మోడళ్ల ధరలను తగ్గిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. హారియర్ ప్రారంభ ధరను రూ. 15.5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు, సఫారీ ధర రూ. 16.2 లక్షల నుంచి రూ. 15.5 లక్షలకు తగ్గించినట్టు కంపెనీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా కంపెనీ తన ఎస్యూవీ వేరియంట్లపై రూ. 1.40 లక్షల వరకు ప్రయోజనాలు కూడా పొడిగిస్తున్నట్టు తెలిపింది. దేశీయంగా కంపెనీ 20 లక్షలకు పైగా ఎస్యూవీల మైలురాయిని చేరిన సందర్భంగా కంపెనీ వినియోగదారులకు ఈ తగ్గింపు, ఇతర ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూలై 31 వరకు చేసే అన్ని బుకింగ్లకు వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ వానాలకు కూడా కంపెనీ తన నెక్సాన్ ఈవీకి రూ. 1.30 లక్షల వరకు, పంచ్ ఈవీకి రూ. 30,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది.