SpiceJet: రూ.3 వేల కోట్ల సమీకరణకు స్పైస్‌జెట్ బోర్డు ఆమోదం

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నిధుల సమీకరణకు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది

Update: 2024-09-21 10:12 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నిధుల సమీకరణకు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల నుంచి రూ.3,000 కోట్ల నిధులను సేకరించడానికి ఒక్కో షేరుకు రూ. 61.60 ఇష్యూ ధరతో 48.7 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయడానికి స్పైస్‌జెట్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది. ఈ సంస్థాగత పెట్టుబడిదారుల్లో సొసైటీ జెనరలే, మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగపూర్), ITI ఫండ్స్, గోల్డ్‌మన్ సాక్స్ (సింగపూర్), BNP పారిబాస్, నోమురా సింగపూర్, జూపిటర్ గ్లోబల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్, 360 వన్, కాప్రి గ్లోబల్, వైట్ ఓక్, బోఫా సెక్యూరిటీస్ ఉన్నాయి.

ఇలా సేకరించిన నిధులను కంపెనీ రుణాలు తీర్చడానికి, ఇతర అభివృద్ధి పనుల కోసం ఉపయోగించనుంది. సెప్టెంబరు 15 నాటికి స్పైస్‌జెట్‌కు చట్టబద్ధమైన బకాయిలు రూ. 601.5 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తంలో, రూ. 297.5 కోట్లు మూలాధారం వద్ద పన్ను మినహాయించబడిన డిపాజిట్ (టీడీఎస్), రూ. 156.4 కోట్లు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్‌కు సంబంధించినవి, రూ. 145.1 కోట్లు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించినవి ఉన్నాయి. విమానయాన రంగంలో సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల మధ్య సజావుగా కార్యకలాపాలు సాగించేందు స్పైస్‌జెట్ ప్రయత్నాలు చేస్తుంది.


Similar News