Stock Market: కొనసాగుతున్న రికార్డు లాభాలు

ఆసియా మార్కెట్లలో భారీ ర్యాలీతో పాటు దేశీయంగా కీలక మెటల్, ఆటో రంగాలు పుంజుకోవడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది.

Update: 2024-09-26 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డులతో దూసుకెళ్తున్నాయి. అంతకుముందు సెషన్‌లో కొత్త మైలురాయికి చేరిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో మరోసారి సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హై స్థాయిలకు చేరాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో భారీ ర్యాలీతో పాటు దేశీయంగా కీలక మెటల్, ఆటో రంగాలు పెద్ద ఎత్తున పుంజుకోవడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. చైనా ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్రకటన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బాగా పెంచింది. దీని ఫలితంగా ప్రపంచ మార్కెట్లతో, ముఖ్యంగా ఆసియా సూచీలు గణనీయంగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల కారణంగా మిడ్-సెషన్ సమయంలో కొంత నెమ్మదించినప్పటికీ ఆఖరు గంటలో లార్జ్ క్యాప్ స్టాక్స్ పుంజుకోవడంతో లాభాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 666.25 పాయింట్లు లాభపడి 85,836 వద్ద, నిఫ్టీ 211.90 పాయింట్ల లాభంతో 26,216 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఆటో రంగాలు 2 శాతానికి పైగా బలపడగా, మిగిలిన రంగాలు సైతం సానుకూలంగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు మాత్రమే నష్టాలను చూశాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్ స్టాక్స్ 2 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.68 వద్ద ఉంది. 

Tags:    

Similar News