స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల ర్యాలీ!

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాల ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కీలక మద్దతుకు తోడు విదేశీ పెట్టుబడులు పెరగడం, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కారణంగా మంగళవారం సూచీలు వరుసగా ఏడో రోజు లాభాలను సాధించాయి

Update: 2023-04-11 11:34 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాల ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కీలక మద్దతుకు తోడు విదేశీ పెట్టుబడులు పెరగడం, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కారణంగా మంగళవారం సూచీలు వరుసగా ఏడో రోజు లాభాలను సాధించాయి. ముఖ్యంగా కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ తిరిగి 60,000 మార్కును అధిగమించింది. వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి యూఎస్ ఫెడ్ కొంతమేర దూకుడును తగ్గించవచ్చనే సంకేతాలతో గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికితోడు దేశీయంగా కీలక కంపెనీలు, రంగాల్లో క్రయవిక్రయాలు, త్రైమాసిక ఫలితాల సానుకూల పరిణామాలతో లాభాలు కొనసాగాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 311.21 పాయింట్లు ఎగసి 60,157 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్లు లాభపడి 17,722 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. ఐటీ రంగం నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలను సాధించాయి.

టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, విప్రో కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.12 వద్ద ఉంది.

Tags:    

Similar News