Stock Market: 1,272 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయంగా బ్లూచిప్ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీ నష్టాలు నమోదయ్యాయి.

Update: 2024-09-30 12:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాల తర్వాత పతనమయ్యాయి. ఆల్‌టైమ్ గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ ఇన్వెస్టర్లు సైతం నిధులను ఉపసంహరించుకోవడం, ఆసియా మార్కెట్లు బలహీనంగా మారడం, దేశీయంగా బ్లూచిప్ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీ నష్టాలు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు నీరసించాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 5 శాతం దెబ్బతినడం, దేశీయంగా రిలయన్స్ షేర్లు కూడా 3 శాతానికి పైగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ కుదేలయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,272.07 పాయింట్లు పతనమై 84,299 వద్ద, నిఫ్టీ 368.10 పాయింట్లు క్షీణించి 25,810 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా మినహా అన్ని రంగాలు 1 శాతానికి పైగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్, టైటాన్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా, టెక్ మహీంద్రా స్టాక్స్ 2 శాతానికి పైగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.79 వద్ద ఉంది. సూచీల భారీ నష్టాల కారణంగా సోమవారం ఒక్కరోజే మదుపర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా కోల్పోగా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 475 లక్షల కోట్లకు చేరింది. 

Tags:    

Similar News