Samsung: పని లేదు, జీతం లేదు.. ఉద్యోగులకు హెచ్చరిక

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శామ్‌సంగ్, ఇండియాలో సమ్మె చేస్తున్న తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది

Update: 2024-09-20 12:22 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శామ్‌సంగ్, ఇండియాలో సమ్మె చేస్తున్న తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సమ్మెను ఇలాగే కొనసాగిస్తే, వేతనాలు అందవని, ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. నిరసన చేస్తున్న ఉద్యోగులు రాజీకి రావడం లేదు, చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంతమంది చట్టవిరుద్ధంగా నిరసన చేస్తున్నారు, ఇది ఇలాగే కొనసాగినట్లయితే ఉద్యోగం నుంచి తొలగిస్తాం, వారి యాక్సెస్‌ను నిలిపివేస్తామని హెచ్చరించింది. అలాగే, పనికి వెళ్లాలనుకునే ఉద్యోగులను అడ్డుకున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ యాజమాన్యం తన నోటీసులో తెలిపింది.

చెన్నై సమీపంలోని సుంగువర్‌చత్రం వద్ద ఉన్న శామ్‌సంగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లోని శామ్‌సంగ్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ ( SIEU) విభాగానికి చెందిన వందలాది మంది కార్మికులు తమకు జీతాలు పెంచాలని, తమ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని, మెరుగైన పని సౌకర్యాలు తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 9 నుండి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ప్లాంట్‌లో చాలా వరకు ఉత్పత్తి ఆగిపోయింది. కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.


Similar News