తొలిసారిగా సెన్సెక్స్ 78000, నిఫ్టీ 24000 మైలురాయి

హెవీవెయిట్ బ్లూచిప్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్ల కారణంగా అధిక లాభాలు నమోదయ్యాయి.

Update: 2024-06-27 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. ఇటీవలే సెన్సెక్స్ కీలక 78 వేల మార్కును దాటిన తర్వాత గురువారం మరో వెయ్యి పాయింట్లు జోడించింది. నిఫ్టీ సైతం తొలిసారిగా 24,000 పాయింట్లు అధిగమించింది. అంతకుముందు సెషన్‌లో ఒడిదుడుకుల మధ్య లాభాలను సాధించిన సూచీలు గురువారం ఉదయం కూడా కొంత బలహీన ర్యాలీని ప్రారంభించాయి. అయితే, ఆ తర్వాత హెవీవెయిట్ బ్లూచిప్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్ల కారణంగా అధిక లాభాలు నమోదయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 568.93 పాయింట్లు ఎగసి 79,243 వద్ద, నిఫ్టీ 175.70 పాయింట్లు లాభపడి 24,044 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఆటో, మెటల్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు అధిక లాభాలు సాధించాయి. ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.43 వద్ద ఉంది. 


Similar News