ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్‌ రీఎంట్రీ!

Update: 2023-10-02 16:29 GMT

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ తిరిగి ఫార్మా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్య సలహాదారుడుగా వ్యవహరిస్తున్న ఐక్వెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా అంతర్జాతీయ ఔషధ రంగంలో ఉన్న యూఎస్‌ దిగ్గజం వియాట్రిస్‌కు చెందిన భారత ఏపీఐ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌తో నిమ్మగడ్డ ప్రసాద్ 17 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఫార్మా పరిశ్రమలో అడుగు పెడుతున్నట్టు అయింది. ఈ ఒప్పందం పూర్తయితే వైజాగ్‌లో మూడు, హైదరాబాద్‌లో మూడు భారీ స్థాయి ఏపీఐ తయారీ ప్లాంట్లతో పాటు హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్‌డీ) కేంద్రాలు ఐక్వెస్ట్‌ చేతికి రానున్నాయి. అలాగే థర్డ్-పార్టీ ఏపీఐ విక్రయాలు కూడా సంస్థ పరం కానున్నాయి. 2000లో నిమ్మగడ్డ ప్రసాద్‌ మ్యాట్రిక్స్‌ ల్యాబ్స్‌ను కొనుగోలు చేశారు.

ఆరేళ్ల వ్యవధిలోనే బిలియన్‌ డాలర్‌ సంస్థగా మ్యాట్రిక్స్‌ను నిలబెట్టడంలో ప్రసాద్‌ ఎంతో కృషి చేశారు. మ్యాట్రిక్స్ ల్యాబ్స్‌ 2006లో మైలాన్‌ కొనుగోలు చేసింది. 2020లో మైలాన్ మరొక సంస్థతో విలీనమై వియాట్రిస్‌గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఫార్మాస్యూటికల్ రంగంలో మా అతిపెద్ద పెట్టుబడి గురించి సంతోషిస్తున్నాం. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారత్‌ గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తున్న సరైన సమయంలో మేము ఈ పెట్టుబడి చేస్తున్నాం. రెండు దశాబ్దాల ప్రయాణంలో నిమ్మగడ్డ ప్రసాద్ ఫార్మాలోకి తిరిగి రంగ ప్రవేశం చేస్తున్నారని ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ కుమార్తె గునుపాటి స్వాతి రెడ్డి తెలిపారు.


Similar News