LIC: ప్రభుత్వానికి రూ. 3,662 కోట్ల డివిడెండ్ అందించిన ఎల్ఐసీ

సీఈఓ సిద్ధార్థ మహంతి, ఇతర ఉన్నతాధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎం పీ తంగిరాల సమక్షంలో చెక్కును ఇచ్చారు.

Update: 2024-08-29 16:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) గురువారం ప్రభుత్వానికి భారీ మొత్తం డివిడెండ్‌ను చెల్లించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,662.17 కోట్ల విలువైన డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ అందజేసింది. సంస్థ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మహంతి, ఇతర ఉన్నతాధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎం పీ తంగిరాల సమక్షంలో చెక్కును ఇచ్చారు. అంతకుముందు 2024, మార్చి 1న ఎల్ఐసీ సంస్థ రూ. 2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కూడా చెల్లించింది. దీంతో 2023-24 సంవత్సరంలో మొత్తం రూ. 6,103.62 కోట్ల డివిడెండ్ కేంద్రానికి అందింది. గతవారం జరిగిన ఎల్‌ఐసీ వార్షిక సాధారణ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. కాగా, ఎల్‌ఐసీలో కేంద్రానికి 96.50 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ మొత్తం ఆస్తుల విలువ రూ. 52.85 లక్షల కోట్లకు పైగా ఉంటుంది.  

Tags:    

Similar News