ఈవీ చార్జింగ్ సదుపాయాల కోసం షెల్‌తో జతకట్టిన JSW MG మోటార్

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా చార్జింగ్ సదుపాయాలను అందించడంపై కంపెనీలు ప్రముఖంగా దృష్టి సారించాయి

Update: 2024-07-10 07:47 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా చార్జింగ్ సదుపాయాలను అందించడంపై కంపెనీలు ప్రముఖంగా దృష్టి సారించాయి. ఇప్పుడు ఇదే బాటలో JSW MG మోటార్ ఇండియా విభాగం దేశవ్యాప్తంగా ఈవీల కోసం పబ్లిక్ చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి షెల్ ఇండియాతో జతకట్టింది. ఈ విషయాన్ని అధికారులు బుధవారం తెలిపారు. రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, JSW MG మోటార్ ఇండియా కస్టమర్లు తమ వాహనాలను చార్జింగ్ చేసుకోడానికి ఇకపై షెల్‌ కంపెనీకి చెందిన చార్జింగ్ స్టేషన్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవచ్చు.

షెల్ ఇండియా భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో 50kW, 60kW DC ఫాస్ట్ చార్జర్‌లను అందిస్తుంది. ఒప్పందం ప్రకారం, ఈ సదుపాయాలను JSW MG మోటార్ వినియోగదారులు వాడుకోవచ్చు. JSW MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈవీ స్వీకరణను వేగవంతం చేయడంలో ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది. మౌలిక సదుపాయాల విస్తరణ ఈవీ ఫాస్ట్ చార్జింగ్‌ను మరింత సౌకర్యవంతంగా, అందుబాటులోకి తెస్తుంది. ఈవీ కస్టమర్‌లు అవాంతరాలు లేని సుదూర ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. షెల్ ఇండియా మార్కెట్స్ డైరెక్టర్ సంజయ్ వర్కీ మాట్లాడుతూ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతం చేయడమే ఈ భాగస్వామ్య లక్ష్యం అని తెలిపారు.


Similar News