RBI: మరోసారి ద్రవ్యోల్బణం విషయంలో రిస్క్ చేయాలనుకోవట్లేదు: ఆర్‌బీఐ గవర్నర్

ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం పరిధిలోకి వచ్చే వరకు వేచి ఉండాలనే ధోరణిలో ఆర్‌బీఐ ఉందన్నారు.

Update: 2024-10-23 16:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ద్రవ్యోల్బణం విషయంలో భారత్ మరోసారి రిస్క్ చేయాలనుకోవట్లేదని, ప్రస్తుతం ఉన్న విధానమే అనువైనదని భావిస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం పరిధిలోకి వచ్చే వరకు వేచి ఉండాలనే ధోరణిలో ఆర్‌బీఐ ఉందన్నారు.ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన(ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. పాలసీ రేటును స్థిరంగా కొనసాగించడం ఇది వరుసగా పదోసారి. సమావేశానికి సంబంధించి బుధవారం విడుదలైన మినిట్స్ ప్రకారం.. ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే స్థిరమైన వృద్ధికి సెంట్రల్ బ్యాంక్ పాలసీ మద్దతివ్వగలుగుతుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచుతూ, పాలసీని తటస్థ వైఖరికి మార్చినట్టు దాస్ పేర్కొన్నారు. మొత్తం మీద, భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా, సమర్థవంతంగా ఉంది. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత మెరుగ్గానే ఉందని దాస్ స్పష్టం చేశారు. సమీపకాలానికి ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి 4 శాతంతో లక్ష్య పరిధిలోకి వస్తుందని దాస్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News