Hyundai IPO: మొదటిరోజు 18 శాతం సబ్‌స్క్రయిబ్ అయిన హ్యూండాయ్ ఇండియా ఐపీఓ

మాతృసంస్థ హ్యూండాయ్ మోటార్ గ్రూప్ రూ. 1.6 లక్షల కోట్ల విలువైన 17.5 శాతం వాటాను విక్రయిస్తోంది.

Update: 2024-10-15 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా వచ్చిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ ఇండియా పబ్లిక్ ఆఫర్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ఐపీఓలో హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) కొత్త షేర్లను జారీ చేయడంలేదు. బదులుగా మాతృసంస్థ హ్యూండాయ్ మోటార్ గ్రూప్ రూ. 1.6 లక్షల కోట్ల విలువైన 17.5 శాతం వాటాను విక్రయిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత భారత్‌లో ఓ వాహన తయారీ సంస్థ ఐపీఓకు రావడంతో బిడ్డింగ్ మొదటిరోజున 18 శాతం సబ్‌స్క్రయిబ్ అయింది. అందులో నాలుగైదు వంతుల ఆర్డర్లను కంపెనీ ఉద్యోగులు బిడ్ చేశారు. హ్యూండాయ్ ఇండియా ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు తమ కోసం రిజర్వు చేసిన 7,78,400 షేర్ల కోసం బిడ్ చేశారు. మంగళవారం మొదలైన సబ్‌స్క్రిప్షన్ 17న ముగియనుంది. షేర్ల కేటాయింపు అక్టోబర్ 18న జరగనుంది. వచ్చే వారంలో 22వ తేదీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. ఐపీఓలో భాగంగా ఒక్కో షేర్ ధరను రూ. 1,865-1,960గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం 14,21,94,700 షేర్లను ఆఫర్‌లో ఉంచారు. ఇన్వెస్టర్లు ఒక లాట్ అంటే కనీసం 7 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. హ్యూండాయ్ మోటార్ ఐపీఓకు ముందు సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 8,315 కోట్లను సమీకరించింది. ఐపీఓ నిధులతో కంపెనీ భారత మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకితో ఉన్న మార్కెట్ వాటా వ్యత్యాసాన్ని తగ్గించేందుకు పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచనుంది. 

Tags:    

Similar News