Hyundai India: వచ్చే పదేళ్లకు రూ.32,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన హ్యుండాయ్

మార్కెట్ వాటాను పెంచుకోవడమే కాకుండా ఎగుమతులకు గణనీయమైన అవకాశాలు ఏర్పడుతాయని కంపెనీ అధికారులు వివరించారు.

Update: 2024-10-09 16:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2023-2032 మధ్య పదేళ్లలో దేశీయంగా రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించింది. బుధవారం ముంబైలో నిర్వహించిన ఐపీఓ సంబంధిత మీడియా సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది. పూణెలోని యూనిట్‌లో రూ. 6,000 కోట్లు పెడతామని, దీని ద్వారా ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని 8.23 లక్షల నుంచి 10.1 లక్షలకు చేర్చగలమని, మార్కెట్ వాటాను పెంచుకోవడమే కాకుండా ఎగుమతులకు గణనీయమైన అవకాశాలు ఏర్పడుతాయని కంపెనీ అధికారులు వివరించారు. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రీమియం విభాగంలో కొత్త వ్యూహాలను అనుసరిస్తామన్నారు. భారత మార్కెట్లో కంపెనీకి ఎస్‌యూవీ సెగ్మెంట్ కీలకంగా భావిస్తోంది. కొత్త మోడళ్లు, భవిష్యత్తులో కొత్త టెక్నాలజీ, దేశీయంగా ఆర్అండ్‌డీ సామర్థ్యాలపై ఎక్కువ పెట్టుబడులకు కంపెనీ సిద్ధంగా ఉంది. అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు పేర్కొంది. కాగా, మరో వారం రోజుల్లో కంపెనీ భారత స్టాక్ మార్కెట్లలో ఐపీఓకు రానుంది. ఇప్పటివరకు రూ. 21 వేల కోట్లతో అతిపెద్ద ఐపీఓగా ఉన్న ఎల్ఐసీని దాటేసి హ్యూండాయ్ ఇండియా రూ. 27,870 కోట్ల నిధులను సమీకరించనుంది. అక్టోబర్ 15 నుంచి మొదలయ్యే ఐపీఓలో ఒక్కో షేర్ ధరను రూ. 1,865-1,960గా నిర్ణయించింది. 

Tags:    

Similar News