భారత్లో రూ. 15,999కే క్రోమ్బుక్ల తయారీ ప్రారంభించిన హెచ్పీ!
దేశీయంగా క్రోమ్బుక్ల తయారీ ప్రారంభించినట్టు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
చెన్నై: దేశీయంగా క్రోమ్బుక్ల తయారీ ప్రారంభించినట్టు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ల తయారీ కంపెనీ హెచ్పీ ఇండియా భాగస్వామ్యంతో స్థానిక క్రోమ్బుక్ తయారీని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ప్లాంటులో తయారీ మొదలైందని హెచ్పీ ఇండియా ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. అలాగే, భారత్లో క్రోమ్బుక్ల తయారీ ప్రారంభించడం ఇదే మొదటిసారి. దేశీయ విద్యార్థుల కోసం సరసమైన ధరలో, మెరుగైన కంప్యూటర్ ఉత్పత్తులను అందించే లక్ష్యానికి ఇది దోహదపడుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ఎక్స్' లో సోమవారం పోస్ట్ చేశారు.
దేశీయంగా తయారైన క్రోమ్బుక్ల ధర రూ. 15,999 నుంచి అందుబాటులో ఉంటాయని, ఆన్లైన్ కొనుగోళ్లు చేయవచ్చని హెచ్పీ ఇండియా ప్రతినిధి చెప్పారు. 2020లో కరోనా మహమ్మారి పరిస్థితుల మధ్య హెచ్పీ కంపెనీ భారత్లో తయారీని వేగవంతం చేసింది. 2021, డిసెంబర్ తర్వాత హెచ్పీ ఎలైట్బుక్స్, హెచ్పీ జీ8 సిరీస్, హెచ్పీ ప్రోబుక్స్లను తయారు చేస్తోంది.