AI సమస్యలు, సవాళ్లపై చర్చించడానికి ఢిల్లీలో 'గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్'

ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమైన అంశంగా మారిపోయింది. దీంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అలాగే నష్టాలు కూడా ఉంటున్నాయి

Update: 2024-07-01 09:41 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమైన అంశంగా మారిపోయింది. దీంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అలాగే నష్టాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ కారణంగా వచ్చే సమస్యలు, దీని అమలుపై ఉన్న సవాళ్లు, ప్రయోజనాల గురించి చర్చించడానికి దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు 'గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్'‌ను నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జులై 3-4 తేదీలలో గ్లోబల్ AI సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. దీనిలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి జితిన్, పరిశ్రమల ప్రముఖులు, నిపుణులు మొదలగు వారు పాల్గొంటారు. వారంతా కూడా భారతదేశంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించి వచ్చే సమస్యలు, సవాళ్లు, ఇతర అభిప్రాయాలను పంచుకుంటారు.

ఏఐ ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉండేలా దేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా చేయడానికి ఈ సమ్మిట్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సైన్స్, పౌర సమాజం, పరిశ్రమ, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, విద్యాసంస్థలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ AI నిపుణులకు కీలకమైన AI సమస్యలు, సవాళ్లపై అంతర్దృష్టులను పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం కొత్త టెక్నాలజీ బాధ్యతాయుతమైన పురోగతికి, ప్రపంచ AI వాటాదారుల మధ్య సహకారాన్ని, విజ్ఞాన మార్పిడిని పెంపొందించడానికి భారత ప్రభుత్వ అంకితభావాన్ని నొక్కి చెబుతుందని మంత్రిత్వ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News