Apple: ఐఫోన్‌ల తయారీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదంపై కేంద్రం విచారణ

యాపిల్ ఐఫోన్‌ల కోసం విడిభాగాలను తయారు చేసే తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే

Update: 2024-09-29 09:44 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: యాపిల్ ఐఫోన్‌ల కోసం విడిభాగాలను తయారు చేసే తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా కేంద్ర అధికారులు, ఫోరెన్సిక్ దర్యాప్తును ప్రారంభిస్తారని తమిళనాడు రాష్ట్ర అధికారి ఆదివారం తెలిపారు. అధికారుల బృందం ప్లాంట్‌కు చేరి ప్రమాదం జరిగిన కారణాలపై విచారణ చేస్తారు. కృష్ణగిరిలో ఉన్నటువంటి ఈ ప్లాంట్‌లో శనివారం మొబైల్ ఫోన్ యాక్ససరీస్ పెయింటింగ్ యూనిట్‌లో తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

మంటల ప్రభావం ఎక్కువ కావడంతో అక్కడి సిబ్బందిని బయటకు పంపించారు. ఏడు ఫైర్ ఇంజన్లు వెంటనే మంటలను ఆర్పి వేయడానికి ప్రయత్నించాయి. సంఘటన జరిగినప్పుడు, మొదటి షిప్టులో సుమారు 1,500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరు కార్మికులు ఆదివారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ప్రమాదంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి యథావిధిగా ఉత్పత్తి జరుగుతుందని అనుకుంటున్నప్పటికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించే అవకాశం లేదని సంబంధిత అధికారులు తెలిపారు.


Similar News