ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ప్రజల వద్దే

రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకా అవి పూర్తి స్థాయిలో తిరిగి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఇండియా పేర్కొంది

Update: 2024-06-03 13:31 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకా అవి పూర్తి స్థాయిలో తిరిగి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఇండియా పేర్కొంది. సోమవారం నాడు ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం, రూ. 2,000 కరెన్సీ నోట్లలో 97.82 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. ఇప్పటికీ దాదాపు రూ.7,755 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. మే 19, 2023న రూ.2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకున్నట్లు RBI ప్రకటించింది. ఆ రోజు వ్యాపారం ముగిసే సమయానికి మార్కెట్లో చలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు అది రూ.7,755 కోట్లకు తగ్గింది.

ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడటానికి రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో సదుపాయం అందించారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకునే సదుపాయం ఉంది. అలాగే, పోస్టాఫీసుల నుంచి కూడా ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2000 నోట్లను పంపవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం.


Similar News