జులై రెండు వారాల్లో భారత ఈక్విటీల్లోకి రూ.15 వేల కోట్ల ఎఫ్‌పీఐలు

భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణల కారణంగా భారత ఈక్విటీల్లోకి జులై మొదటి రెండు వారాల్లో(జులై 12 వరకు) విదేశీ పెట్టుబడిదారులు రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు.

Update: 2024-07-14 06:31 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణల కారణంగా భారత ఈక్విటీల్లోకి జులై మొదటి రెండు వారాల్లో(జులై 12 వరకు) విదేశీ పెట్టుబడిదారులు రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది, అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు.

అంతకు ముందు, మారిషస్‌తో భారతదేశ పన్ను ఒప్పందంలో మార్పులు, US బాండ్ ఈల్డ్‌లలో స్థిరమైన పెరుగుదలపై ఆందోళనలతో ఎఫ్‌పీఐలు మేలో ఎన్నికలకు ముందు రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో గతంలో ఉన్న సంస్కరణలు కొనసాగే అవకాశం ఉంది, దీంతో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల పట్ల సానుకూలంగా ఉన్నారు.

ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో 60,000 కోట్ల రూపాయల మొత్తాన్ని విక్రయించగా, ఫిబ్రవరి, మార్చి, జూన్‌లలో కలిపి 63,200 కోట్ల రూపాయలను కొనుగోలు చేశారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్‌లోకి ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలు దారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు

Tags:    

Similar News