వైసీపీకి షాక్ మీద షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి..

Update: 2024-08-28 09:54 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి.  ఆ పార్టీకి ముగ్గురు కీలక నేతలు గుడ్ బై చెప్పారు. జగన్ అధికారంలో ఉండగా ముగ్గురు నేతలు కీలక పదవులు అనుభవించారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ ఈ ఉదయం రాజీనామా చేయగా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై ఓడిపోయారు. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పోతుల సునీతకు పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చారు.

అయితే 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కరణం బలరాం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపాలవడంతో పార్టీ కార్యక్రమాలకు పోతుల సునీత క్రమేపీ దూరంగా ఉంటూవచ్చారు. తాజాగా  ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆమె పంపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంగళవారం ఏలూరు మేయర్ దంపతులతో పాటు కీలక నేతలు రాజీనామా చేశారు. బుధవారం ముగ్గురు కీలక నేతలు పార్టీ వీడటం ఆ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

Tags:    

Similar News