ఇంటి బయట వాణి.. లోపల మాధురి.. మళ్లీ మొదలైన దువ్వాడ రచ్చ

వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ (Duvvada Srinivas) వివాదం మళ్లీ రచ్చకెక్కింది. ...

Update: 2024-09-07 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ (Duvvada Srinivas) వివాదం మళ్లీ రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురి (Divvela Madhuri) ఉండటంపై ఆయన భార్య దువ్వాడ వాణి (Duvvada Vani) ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని (Tekkali) శ్రీనివాస్ నివాసం బాల్కనీలో దివ్వెల మాధురి అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు. దీంతో దువ్వాడ వాణి, ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఇంటికి వద్దకు వెళ్లారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాణి, ఆమె కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఆ ఇల్లు తమదని...దివ్వెల మాధురి ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. మాధురిని వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

అంతకుముందు జరిగిందిదే..

కాగా కొద్దిరోజుల క్రితం ఈ వివాదం ముగిసిందనుకున్న సమయంలో దివ్వెల మాధురి మరోసారి కలకలం రేపింది. గతంలో అదే ఇంటి ముందు దువ్వాడ వాణి ఆందోళనకు దిగారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురితో అక్రమంగా ఉంటున్నారంటూ నిరసనకు దిగారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకేత్తించింది. దువ్వాడ శ్రీనివాస్, వాణి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ తరపున చురుగ్గా పని చేశారు. దీంతో జగన్ ప్రభుత్వంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఈ క్రమంలో వైసీపీలో మహిళా నాయకురాలిగా పని చేస్తున్న దివ్వెల మాధురి పరిచయం అయ్యారు. ఈ పరిచయం సహజీవనం వైపు సాగింది.

అయితే దువ్వాడ వాణితో విభేదాల నేపథ్యంలో దివ్వెల మాధురి వద్దే శ్రీనివాస్‌ ఉంటున్నారు. దీంతో దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని పట్టించుకోకుండా దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటున్నారని టెక్కలిలోని నివాసం వద్ద నిరసనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం వారం పాటు రచ్చ రచ్చ చేసింది.  చివరకు దువ్వాడ శ్రీనివాస్, వాణి మధ్య వివాదాన్ని తొలగించేందుకు ఇద్దరి కుటుంబాలు ప్రయత్నం చేశాయి. అయితే వాణి వెనక్కి తగ్గినా శ్రీనివాస్ మాత్రం తన అభిప్రాయాన్ని క్లారిటీగా చెప్పలేదు. వాణితో విడాకుల వివాదం కోర్టులో ఉందని చెప్పారు. కానీ భార్యతో కలిసే ఉంటానని శ్రీనివాస్ తెలపలేదు. ఇలా జరుగుతుండగానే టెక్కలిలోని శ్రీనివాస్ ఇంట్లో మాధురి కనిపించడంతో దువ్వాడ వాణి మళ్లీ నిరసనకు దిగారు. 

ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ కూడా సాగింది. దువ్వాడ వాణి చేసిన ఆరోపణలపై మనస్థాపం చెందిన దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు క్షమాపణలు చెప్పాలని దువ్వాడ వాణి ఇంటి వద్ద తాను కూడా నిరసన చేస్తానంటూ శ్రీకాకుళం నుంచి టెక్కలి బయల్దేరిన మాధురి... ప్రయాణంలో రోడ్డుపై మరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో మాధురి తలకు గాయం అయింది. తాను చనిపోయేందుకే ప్రమాదం చేసినట్లు మాధురి తెలిపారు. అయితే చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు టెక్కలిలోని శ్రీనివాస్ ఇంటి వద్ద కనిపించి మాధురి మరోసారి రచ్చకు తెరలేపారు. మరి ఏం జరుగుందో చూడాలి. 


Similar News